రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

Jun 16 2025 7:11 AM | Updated on Jun 16 2025 7:11 AM

రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

హిందూపురం: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని పట్టాలపై ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని రైల్వే పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద మడకశిర మండలం కల్లుమర్రి గ్రామంలో వెలసిన వీరకేతమ్మ ఆలయం ఫొటో ఉంది. 49 ఏళ్ల వయస్సు. ఐదు అడుగుల ఎత్తు, పింక్‌.. బ్లూ కలర్‌ షర్ట్‌, ఆరెంజ్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు హిందూపురం రైల్వే పోలీసుల (94412 38182)కు సమాచారం అందిచాలని కోరారు.

బస్సులో డీజిల్‌ చోరీ

సోమందేపల్లి: స్థానిక నక్కలగుట్ట కాలనీ వద్ద ఆపిన రెండు బస్సుల్లో డీజిల్‌ను దుండగులు అపహరించుకెళ్లారు. ప్రైవేటు కంపెనీకి చెందిన సదరు వాహనాలు రోజూ కాలనీ నుంచి కార్మికులను పరిశ్రమలకు తరలిస్తుంటాయి. ఈ క్రమంలో రాత్రి సమయాల్లో కాలనీ వద్ద డ్రైవర్లు బస్సులు నిలుపుతుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కాలనీ వద్ద ఆపిన రెండు బస్సులను డ్రైవర్లు అనిల్‌, శీనానాయక్‌ ఆపి ఇంటికెళ్లి నిద్రించారు. ఉదయం వచ్చి చూడగా డీజిల్‌ ట్యాంక్‌ మూతలు తెరిచి ఉండడం గమనించి పరిశీలించారు. అందులోని డీజిల్‌ మొత్తం అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

అనంతపురం: నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్‌ తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన మబ్బు రామకృష్ణ (49) మూడేళ్ల క్రితం తన భార్య శివమ్మతో కలసి ఆమె స్వగ్రామమైన ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో స్థిరపడ్డాడు. అనంతపురంలోని పీవీకేకే కళాశాలలో వాచ్‌మెన్‌గా రామకృష్ణ, కూలి పనులతో శివమ్మ కుటుంబాన్ని పోషించుకునే వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా, కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కుమార్తె శిల్ప విషపూరిత ద్రావకం తాగి పామిడిలోని సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రామకృష్ణ, శివమ్మ.. శనివారం కుమార్తెను చూసేందుకు వెళ్లారు. రాత్రి తనకు డ్యూటీ ఉందని రామకృష్ణ అనంతపురానికి వచ్చి నేరుగా ఇందిరానగర్‌లో ఉన్న స్నేహితుడు మహబూబ్‌బాషా ఇంటికెళ్లాడు. అనంతరం ఇద్దరూ కలసి మద్యం సేవించారు. రాత్రి మహబూబ్‌ బాషా ఇంటి బయట నిద్రించిన రామకృష్ణ ఆదివారం ఉదయానికే మృతి కనిపించడంతో విషయాన్ని శివమ్మకు మహబూబ్‌బాషా ఫోన్‌ చేసి తెలిపాడు. శివమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement