
టీచర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ
కళ్యాణదుర్గం రూరల్: మూడు రోజుల క్రితం కిడ్నాప్నకు గురైన ఉపాధ్యాయురాలి కేసులో మిస్టరీ వీడింది. కుటుంబసభ్యులే పథకం ప్రకారం ఆమెను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం కళ్యాణదుర్గం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ రవిబాబు, సీఐ నీలకంఠేశ్వర్ వెల్లడించారు. బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన మారుతమ్మ... కంబదూరు మండలం కూరకులపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుతమ్మకు పెళ్లి చేస్తే కుటుంబపోషణ భారమవుతుందని భావించిన కుటుంబసభ్యులు వచ్చిన సంబంధాలను పథకం ప్రకారం చెడగొడుతూ వచ్చేవారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన ఎర్రిస్వామితో అయిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇది గిట్టని కుటుంబసభ్యులు ఎలాగైనా ఇద్దరినీ విడగొట్టాలని భావించారు. ఇందులో భాగంగా ఈ నెల 12న విధులు ముగించుకుని భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బొలెరో వాహనంలో వచ్చిన 11 మంది కుటుంబసభ్యులు అటకాయించి మారుతమ్మను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. విషయాన్ని వెంటనే ఎర్రిస్వామి కంబదూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆస్తి కోసం మట్టుబెట్టే ప్రయత్నం
అనంతపురంలో విలువైన స్థలం మారుతమ్మ పేరుపై ఉంది. అలాగే బంగారు నగలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. తమను కాదని ఆమె ఎర్రిస్వామిని పెళ్లి చేసుకోవడంతో ఆస్తితో పాటు ఆమె సంపాదన మొత్తం అతనే అనుభవిస్తాడనే అక్కసు మారుతమ్మ కుటుంబసభ్యుల్లో నెలకొంది. దీంతో మారుతమ్మను పథకం ప్రకారం కిడ్నాప్ చేసి బెంగళూరులోని బంధువు ఇంటికి తరలించారు. ఆస్తితో పాటు బంగారు నగలు స్వాధీనం చేయాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. ఎర్రిస్వామిని వదిలేసి వివాహితుడైన తమ బంధువులోని ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే మారుతమ్మ తలొగ్గకపోవడంతో చివరకు హతమార్చాలని తల్లిదండ్రులు భావించారు. విషయం తెలుసుకున్న మారుతమ్మ చాకచక్యంగా వ్యవహరించారు. ‘మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటా’నంటూ నమ్మబలికారు. దీంతో ఆదివారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం కళ్యాణదుర్గం శివారులోకి చేరుకోగానే అప్పటికే అక్కడ వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలెరోను అటకాయించి పరిశీలించారు. అందులో మారణాయుధం లభ్యం కావడంతో అనుమానంతో పీఎస్కు తరలించి, విచారణ చేపట్టారు. అదే సమయంలో మారుతమ్మ తనపై కుటుంబసభ్యులు సాగించిన కుట్రలు వివరించడంతో విషయం కాస్త బయటపడింది. మారుతమ్మ ఫిర్యాదు మేరకు ఆమె కుటుంబసభ్యులైన ఆనంద్, శ్యామలమ్మ, విశాఖ, ఎల్లప్ప, మహాలక్ష్మి, అంకాలప్ప, మహేష్, రమేష్, వన్నూరుస్వామి, మహేంద్ర, బాబుపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు
11 మంది నిందితుల అరెస్ట్