‘పోలీసు స్పందన’కు 80 వినతులు | - | Sakshi
Sakshi News home page

‘పోలీసు స్పందన’కు 80 వినతులు

Jun 17 2025 4:52 AM | Updated on Jun 17 2025 4:52 AM

‘పోలీ

‘పోలీసు స్పందన’కు 80 వినతులు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్‌, మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్‌ అడ్వైజరీ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.

మద్యం కేసులో ఇద్దరికి జైలు

సోమందేపల్లి: కర్ణాటక మద్యం విక్రయించిన కేసులో ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. 2022లో పత్తికుంటపల్లిలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఆంజనేయులు, ఓబులేస్‌పై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుకొండ కోర్టులో కేసు విచారణ జరిగింది. సోమవారం తుది విచారణ అనంతరం మద్యం విక్రేతలిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బొజ్జప్ప తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.

నగదు వసూళ్లకు పాల్పడిన వారిపై కేసు నమోదు

కదిరి టౌన్‌: పోలీసుల పేరు చెప్పి ప్రజలను బెదిరించి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. కదిరిలోని ఇందిరా గాంధీ వీధిలో నివాసముంటున్న తమిళనాడులోని అర్చామికి చెందిన మారుదముత్తు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనంతపురం సంతలో కొనుగోలు చేసిన పశువులను రెండు కంటైనర్లలో కదిరి మీదుగా తరలిస్తుండగా కుటాగుళ్లకు చెందిన పొట్టిండ్ల నాగభూషణ, బుక్యా ఆంజనేయులు నాయక్‌, కదిరికి చెందిన కుళ్లాయప్ప బొలెరో వాహనంలో వెంబడించి ఆటకాయించారు. తాము పోలీసులమంటూ బెదిరించి రూ.20 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.6 వేలు తీసుకకుని వదిలేశారు. ఘటనకు సంబంధించి మారుదముత్తు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం నిందితులపై కేసు నమోదు చేశారు.

వేధింపుల కేసు నమోదు

కదిరి టౌన్‌: స్థానిక వలీసాహెబ్‌ రోడ్డులో నివాసముంటున్న వివాహిత నాగేశ్వరి ఫిర్యాదు మేరకు ఆమె భర్త ప్రహ్లాదశెట్టిపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. 14 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. టిఫెన్‌ బండితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా భర్త వేధింపులకు పాల్పడుతూ వచ్చేవాడు. ఆదివారం దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెందిన ఆమె అదే రోజు రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న తల్లి, తమ్ముడు ఆమెను కాపాడారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రహ్లాదశెట్టిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం తాగేందుకు

డబ్బివ్వలేదని ఆత్మహత్య

ధర్మవరం అర్బన్‌: మద్యం తాగేందుకు డబ్బివ్వలేదని ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధర్మవరంలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్‌కాలనీకి చెందిన గుండు గోపాల్‌(57) తాగుడుకు బానిసయ్యాడు. అతని భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో కాన్పు ఖర్చుల కోసం రూ.10 వేలు దాచుకున్నారు. ఆ డబ్బు కావాలని భార్య, తల్లితో గోపాల్‌ గొడవపడ్డాడు. వారు ఇవ్వకపోవడంతో క్షణికావేశానికి లోనయ్యాడు. కాలనీకి సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘పోలీసు స్పందన’కు  80 వినతులు 1
1/1

‘పోలీసు స్పందన’కు 80 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement