
సౌత్జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేత నెల్ల
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ స్టేడియం వేదికగా నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేతగా నెల్లూరు జట్టు నిలిచింది. సోమవారం అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ను ఎంచుకున్న అనంతపురం జట్టు 48.5 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో మచ్చా దత్తారెడ్డి 58 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 43, మహేందర్రెడ్డి 58, రాజకుళ్లాయప్ప 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన నెల్లూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 49.4 ఓవర్లలో 296 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో రేవంత్రెడ్డి 104 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్తో 88 పరుగులు సాధించాడు. పాయింట్ల టేబుల్లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన నెల్లూరు జట్టును విజేతగా ప్రకటిస్తూ ట్రోఫీని ఏడీసీఏ సెక్రటరీ వి.భీమలింగారెడ్డి అందజేశారు.
బైక్ను అడ్డుకుని చైన్స్నాచింగ్
రొళ్ల: ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహిళను అడ్డుకుని ఆమె మెడలోని బంగారు నగను అపహరించుకెళ్లిన ఘటన సంచలనం రేకెత్తించింది. బాధితురాలు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం హెచ్టీ హళ్లి గ్రామానికి చెందిన సిద్ధప్ప భార్య అనిత యానిమేటర్గా చేస్తున్నారు. సోమవారం వెలుగు కార్యాలయంలో పని ఉండడంతో స్వగ్రామం నుంచి రొళ్లకు ద్విచక్ర వాహనంపై బయలురేరారు. మల్లినమడుగు పంచాయతీ కేంద్రం దాటిన తర్వాత ప్రధాన రహదారిపై గుడిబండ వైపు నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఓ ఆగంతకుడు ద్విచక్రవాహనంపై ఆమెను అనుసరిస్తూ హెచ్ఎం పల్లి సమీపంలోని బైలాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకోగానే నిర్జన ప్రదేశంలో అడ్డుకున్నాడు. ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు మాంగల్యం చైన్ను లాక్కొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రొళ్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
గాండ్లపెంట: ఎద్దుల బండి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం ముక్కంవాండ్ల పల్లికి చెందిన శ్రీహరినాయుడు(35)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సోమవారం శ్రీహరినాయుడు దంపతులు గాండ్లపెంట మండలం రెక్కమానుకు ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు. పెడకంటివారిపల్లి వద్దకు చేరుకోగానే రోడ్డు సమీపంలోని పొలం నుంచి గాజులవాండ్లపల్లికి చెందిన రైతు ఎం.కృష్ణానాయక్కు చెందిన ఎద్దుల బండి ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అప్పటికే అత్యంత సమీపంలోకి చేరుకున్న శ్రీహరినాయుడు బ్రేక్లు వేసినా ఫలితం లేకపోవడంతో ఎద్దుల బండిని ఢీకొన్నాడు. ఘటనలో తీవ్ర గాయాలతో శ్రీహరినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన భార్య సింధూజను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎన్పీకుంట పోలీసులు కేసు నమోదు చేశారు.

సౌత్జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేత నెల్ల

సౌత్జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేత నెల్ల