మడకశిర: రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మడకశిరలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఇండోర్ స్టేడియం, డిపో పరిధిలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే అంబేడ్కర్, బాబూజగ్జీవన్రామ్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేసి, ఆర్టీసీ డిపోను సందర్శించనున్నారు.
ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
పుట్టపర్తి అర్బన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్న సీసీటీవీ ఇన్స్టలేషన్ కోర్సులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని బుక్కపట్నం ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మగ్బూల్ హుస్సేన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. మూడు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 79815 41994లో సంప్రదించవచ్చు.
గోడ కూలి వృద్ధురాలి మృతి
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లి గ్రామంలో బుధవారం పాత మిద్దె గోడ కూలి నారాయణమ్మ(73) మృతి చెందింది. మరో వృద్దురాలు వసుంధరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఎండకు తాళలేక రామాలయం వీధిలోని వేమారెడ్డి పాత మిద్దె వద్ద రోజూ వృద్ధులు సేదతీరుతుంటారు. బుధవారం అక్కడ నారాయణమ్మ, వసుంధరమ్మ కూర్చొని మాట్లాడుకుంటుండగా ఉన్నఫళంగా గోడ కూలింది. శిథిలాల కింద చిక్కుకుని నారాయణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడిన వసుంధరమ్మను గ్రామస్తులు చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు.
ప్రమాదంలో ఫైర్ మెన్ మృతి
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఫైర్ మెన్ సుధాకర్ (40) దుర్మరణం పాలయ్యారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన పుట్టపర్తిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఫైర్మెన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకున్న ఆయన అనంతపురానికి వెళ్లే క్రమంలో మామిళ్లపల్లికి చేరుకున్నారు. అనంతరం బస్సు కోసం జాతీయ రహదారిని దాటుతుండగా బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య రమ్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.