
ఉగ్రవాదులది పిరికిపంద చర్య
హిందూపురం టౌన్: కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అభివర్ణించారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారన్నారు. మృతులందరికీ సంతాపం తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం, మడకశిర నియోజకవర్గ సమన్వయకర్తలు దీపిక, ఈరలక్క మాట్లాడుతూ ఉగ్రదాడి ఘటన ఎంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అండగా యావత్ దేశం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్గా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వేణురెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కురుబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్ గౌడ్, జిల్లా అధికారి ప్రతినిధి శివశంకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి తిప్పేరుద్రయ్య, పట్టణ కన్వీనర్ మన్సూర్, మండల కన్వీనర్ రాము, చిలమత్తూరు మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.