
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు
● మెమూ రైలును అనంతపురం నుంచి
నడపాలని నిర్ణయం
● కొత్తగా ఏడు స్టేషన్లలో
స్టాపింగ్కు అనుమతి
పుట్టపర్తి టౌన్: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెము రైలును ఇకపై అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు ఆమోదించారు. త్వరలోనే ఈ రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి రోజూ మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు.