
వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే , ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాలన్నారు. జిల్లా సోలార్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పశువులకు నీటి తొట్టెల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వి.రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.