
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
పరిగి: పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి కోరారు. అధికార కూటమి ప్రభుత్వం ట్రాప్లో పడొద్దన్నారు. మంగళవారం ఆయన పరిగి పోలీసు స్టేషన్ ఎదుట విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తమ పార్టీకి చెందిన దళిత నాయకుడు, వాల్మీకి వర్గానికి చెందిన మరో నాయకుడిని తీవ్రవాదుల్లా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ మంగళవారం శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చామన్నారు. అయితే పోలీసులు ఉదయమే తనతో పాటు మరో ముగ్గురు నేతలను అరెస్టు చేశారన్నారు. పోలీస్ వ్యవస్థపై తమకు గౌరవముందన్నారు. అందుకే వారికి ఎప్పుడూ సహకరిస్తామన్నారు. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. ఎవరో చెప్పారని అక్రమ కేసులు బనాయించకుండా నిజానిజాల కోసం విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.