
ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతా భావం
కదిరి అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతాభావం నానాటికీ పెరిగిపోతోంది. 2019లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1–2019 సర్క్యులర్ జారీ చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించింది. అంతేకాక ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ కార్మికులను ఉద్యోగులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఫలితంగా సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అటకెక్కించింది. దీంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఈ క్రమంలో తరచూ ఏదో ఒక డిపో పరిధిలో కార్మికులు నిరసన బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. దశలవారీ ఉద్యమ కార్యాచరణతో కదిరి డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సార్లు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. అలాగే మరో రెండు పర్యాయాలు గేట్ మీట్లతో ధర్నా నిర్వహించారు.
రోడ్డున పడనున్న కుటుంబాలు
జిల్లాలో వ్యాప్తంగా మొత్తం ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు రెండు కలిపి 410 వరకు ఉన్నాయి. ఈ ఆరు డిపోల్లో 1,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అమలు కాకపోవడంతో ఇప్పటి వరకూ సుమారు 50 మంది డ్రైవర్లు, కండక్టర్లు సర్వీస్లో నుంచి రిమూవ్ అయినట్లు సమాచారం. ఇదే బాటలో మరికొందరు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి.
గత ప్రభుత్వంలో నో టెన్షన్
చిన్న పాటి తప్పిదాలకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం
రోజూ భయపడుతూ విధులు
నిర్వర్తించలేమంటున్న ఉద్యోగులు
ఉద్యోగ భద్రత కోసం పోరాడతాం
ఆర్టీసీలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు చాలా భయపడతున్నారు. చిన్నపాటి తప్పిదాలకు సర్వీసు నుంచి తొలగిస్తూ ఉద్యోగుల ఆత్మస్తైర్యం దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేసే వరకూ పోరాటాలు సాగిస్తాం.
– ఎన్వీ రమణ, నేషనల్ మజ్దూర్
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కదిరి డిపో
మా పరిధిలో లేదు
ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1–19 అమలు అనేది మా పరిధిలోని అంశం కాదు. ఇది పెద్దవాళ్లు చూసుకుంటారు. దీనిపై నేను ఏమీ మాట్లాడకూడదు.
– మధుసూదన్, జిల్లా ప్రజారవాణా అధికారి
ఏపీఎస్ఆర్టీసీలో 1963లో ఏర్పాటు చేసుకున్న కాండక్ట్, క్లాసిఫికేషన్, అప్పీల్ మేరకు చిన్న చిన్న తప్పులకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు భారీ శిక్షలు వేసేవారు. ఎవరైనా టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా తనిఖీ అధికారి గుర్తిస్తే తక్షణమే కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగిచేవారు. అలాగే తన ప్రమేయం లేకుండా ప్రమాదం చోటు చేసుకుంటే డ్రైవర్ను బాధ్యుడిని చేస్తూ విధుల నుంచి తొలగించేవారు. 2019 వరకూ ఈ నిరంకుశ ధోరణి కొనసాగుతూ వచ్చింది. రాష్ట్రంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే తొలుత ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ, 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో సంస్థలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్ వరకు విధివిధానాలను రూపొందిస్తూ ఎన్ఏంయూ నాయకులతో అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు సంప్రదించి సర్కులర్ 1–19ని తీసుకువచ్చారు. దీంతో 2024 వరకు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. తప్పు చేసి పట్టుబడిన కండక్టర్లు, డ్రైవర్లకు ఇంక్రిమెంట్లుతో కోతలు విధించడం తప్ప వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్కులర్ 1–19ని అటకెక్కించింది. ఫలితంగా కదిరి డిపోలో పనిచేస్తున్న ఓ కండక్టర్, డ్రైవర్ చిన్నపాటి తప్పిదానికి తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచింది.

ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతా భావం