ఆరోపణలకు ఆధారాలతోనే సమాధానం | - | Sakshi
Sakshi News home page

ఆరోపణలకు ఆధారాలతోనే సమాధానం

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

వేమిరెడ్డి కుటుంబంపై

ధ్వజమెత్తిన అనిల్‌

నెల్లూరు రూరల్‌: తనపై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై చేసిన ఆరోపణలకు ఆధారాలతోనే సమాధానం చెప్తున్నానని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. మహిళలను అగౌరవపర్చేలా తానెన్నడూ మాట్లాడలేదని చెప్పారు. ప్రశాంతమ్మను తాను రాజమాత అని సంబోధించానని, అది తప్పుగా అనిపిస్తే పెద్దమ్మ అని పిలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వ్యాపార వ్యవహారాలపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. లక్ష్మీ క్వార్ట్‌జ్‌ కంపెనీ ద్వారా పలువురికి నష్టం జరిగిందని ఆరోపించారు. అనంతరం ఫినీ క్వార్ట్‌జ్‌ పేరుతో ట్రేడింగ్‌ కంపెనీని ఏర్పాటు చేసి, అందులో డైరెక్టర్లుగా వేమిరెడ్డి అనుచరులున్నారని పేర్కొన్నారు. డౌ కంపెనీకి లేఖ ఇచ్చిన వ్యవహారంపై ప్రశ్నించానని.. రమణకుమార్‌ ఎవరికి సంబంధించిన వ్యక్తో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అహంకారానికి నిదర్శనం

2014లో అబ్దుల్‌ అజీజ్‌ను మేయర్‌ చేసే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో తాము కలిసి లేమని తెలిపారు. గోవాలో క్యాంపు పెట్టి టీడీపీ నేతలతో కలిసి జంపయ్యేందుకు యత్నించిన సమయంలో తాము శ్రీధర్‌రెడ్డితో కలిసి లాబీలో రాత్రంతా కూర్చున్నామని చెప్పారు. మైనార్టీలకు తమ అధినేత ఇచ్చిన హామీని నిలబెట్టేందుకే యత్నించామని వివరించారు. అజీజ్‌కు ఎవరైనా సాయం చేసి ఉంటే దాన్ని గౌరవంగా చెప్పొచ్చే గానీ, దానం చేశామనడం ద్వారా ఒక మైనార్టీని అవమానించారని విమర్శించారు. ఇది డబ్బు అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. 2018లో తనకు ఎంపీ టికెట్‌ను ఇప్పించాలని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగారని గుర్తుచేశారు. 2019లో తనకు ఆర్థిక సాయం చేసింది జగన్‌మోహన్‌రెడ్డేనని, ఆదాల ప్రభాకర్‌రెడ్డి సైతం తనను ఇంటికి పిలిచి సాయం చేశారని గుర్తుచేశారు. తన జీవితంలో ఎవరి కాళ్లకు మొక్కలేదని.. తాను వేమిరెడ్డి దంపతులను శివపార్వతులు అన్నట్లు నిరూపించాలని సవాల్‌ చేశారు. ఇస్కాన్‌ సిటీలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్థలం తమ కుటుంబానికి చెందిందేనని, దీనికి గానూ బ్యాంక్‌ ద్వారా నగదు సాయాన్ని తమ తాత చేశారని పేర్కొన్నారు. ఇస్కాన్‌ సిటీలోని స్థలాన్ని వేమిరెడ్డి కుటుంబసభ్యుల వద్ద తన తండ్రి కొనుగోలు చేశారని తెలిపారు. దొంతాలిలో తమ కుటుంబానికి చాలా కాలంగా వ్యవసాయ భూములున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపించానని చెప్పడం సరికాదని హితవు పలికారు.

చైనాకు వెళ్లాననే ఆరోపణలు అబద్ధం

తాను చైనా వెళ్లానంటూ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. తన పాస్‌పోర్టును చూపిస్తూ.. తాను ఒక్కసారైనా అక్కడికెళ్లానని నిరూపిస్తే కాళ్లకు మొక్కుతానని చెప్పారు. తనపై చూపించిన 70 మంది జాబితా తాము విధించిన జరిమానాలకు సంబంధించిందని, కమీషన్ల వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదన్నారు. జాబితాలో బద్రి పేరుందని, అతడ్ని అడిగితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. తనపై కేసులు పెట్టి ఆస్తులను జప్తు చేస్తారని చేస్తున్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని వివరించారు. 2029లో ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తానని, వీలైతే అక్కడ నోట్ల కట్టలతో తనతో పోటీ పడాలని ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. యువగళం పాదయాత్ర సమయంలోనే వేమిరెడ్డి టచ్‌లో ఉన్నారంటూ లోకేశ్‌ స్వయంగా చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. మైనార్టీలంటే తనకు గౌరవమని, వారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. శాంతినికేతన్‌ విల్లా ల వ్యవహారంలో కొందరికి అడ్వాన్స్‌ డబ్బులింకా ఇవ్వాల్సి ఉందని, త్వరగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కోటారెడ్డి తనకు సాయం చేసిన మాట వాస్తవమేనని, దాన్ని తానెప్పుడూ ఖండించలేదని పేర్కొన్నారు. దెయ్యాలకే వేదా లు చెప్పే టాలెంట్‌ శ్రీధర్‌రెడ్డికి ఉందని విమర్శించారు. ఖలీల్‌ అహ్మద్‌, కార్పొరేటర్లు కామాక్షీదేవి, నాగార్జున, శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరావు, జయలక్ష్మి, నేతలు మీరామొహిద్దీన్‌, అబ్దుల్‌ మస్తాన్‌, శ్రీధ ర్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement