● బాలల హక్కుల పరిరక్షణ
కమిషన్కు తిరుపతి ఎంపీ లేఖ
చిల్లకూరు: ‘రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలను ఎత్తివేయడంతో దళిత విద్యార్థుల భవిష్యత్ ఆందోళకరంగా మారింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి’ అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కోటలో, విజయనగరం, గుంటూరులోని తాడికొండ గురుకులం, విజయనగరంలోని మారికవలసలలో సుమారుగా 1,980 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు చెప్పారు. వీటిలో ప్రభుత్వం ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని, దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే వీటిని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులిచ్చారు?, ఇందుకు సంబంధించిన మౌలిక వసతులు ఎలా కల్పిస్తున్నారనే విషయాలు తల్లిదండ్రులకు తెలియజేయకుండానే నేరుగా విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. వీరికి నాలుగు గురుకులాలను అప్పగించే క్రమంలో అప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇతర ప్రాంతాల్లో ఉండే గురుకులాల్లో విలీనం చేయడం ద్వారా సంఖ్య పెరిగిపోయిందన్నారు. విలీనమైన చోట్ల విద్యార్థులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత తదితర ప్రాథమిక సౌకర్యాల్లేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, మానవ హక్కుల కమిషన్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని లేఖ రాసినట్లు తెలిపారు. వెంటనే స్పందించి దళిత విద్యార్థులకు చెందిన గురుకుల పాఠశాలలను పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నామన్నారు.


