● శకునాలపల్లి సచివాలయ సిబ్బంది నిర్వాకం
● అవాకై ్కన కుటుంబసభ్యులు
● పింఛన్ దరఖాస్తుకు నోచుకోక ప్రదక్షిణలు
ఉదయగిరి రూరల్: దాదాపు ఏడాదిన్నర క్రితం వ్యక్తి మృతి చెందగా, డెత్ సర్టిఫికెట్ను సైతం సచివాలయ సిబ్బంది జారీ చేశారు. అయితే ఆయన బతికే ఉన్నారని వారు ప్రకటించడంతో వితంతు పింఛన్ కోసం వెళ్లిన ఆయన భార్య అవాకై ్కన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో వితంతు పింఛన్ నిమిత్తం సచివాలయానికి ఆయన భార్య వెళ్లగా, నీ భర్త బతికే ఉన్నారని ఆన్లైన్లో చూపుతోందని, దరఖాస్తు దాఖలుకు అనర్హురాలని వారు సెలవిచ్చారు. నిజానికి ఉదయగిరి మండలం శకునాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దాసరి రాజశేఖర్, మణిచందన భార్యాభర్తలు. అనారోగ్యంతో గతేడాది జనవరి 26న ఆయన మృతి చెందారు. ఆ సమయంలో శకునాలపల్లి సచివాలయం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబసభ్యులు పొందారు. ఆపై మణిచందన, ఆమె కుమారుడు జయంత్ పేరుపై స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆశలు.. అడియాసలు
మరణ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పింఛన్ దరఖాస్తు నిమిత్తం సచివాలయానికి మణిచందన వెళ్లారు. వీటిని పరిశీలించి, కుటుంబసభ్యుల వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేయగా, రాజశేఖర్ బతికే ఉన్నారని నమోదైంది. విషయం తెలియడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబపోషణ భారంగా ఉన్న సమయంలో పింఛన్ మంజూరవుతుందని ఆశగా ఉన్న ఆమె సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆవేదనకు గురయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.


