నెల్లూరు సిటీ: నెల్లూరు నుంచి జొన్నవాడకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని మహిళ పెట్రోల్ మంటల్లో చిక్కుకొని కనిపించారు. స్థానికులు గమనించి కాపాడేలోపే పూర్తిగా కాలిపోయి మృత్యువాత పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. జొన్నవాడ ఆర్చి సమీపంలోని మలుపు వద్ద రోడ్డు పక్కన ఒక్కసారిగా మంటలు రావడాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. ఎవరో చెత్తను తగలబెట్టి ఉంటారని అటుగా వెళ్తున్న కొందరు భావించి వెళ్లిపోయారు. కొందరు యువకులు మాత్రం సందేహంతో వెళ్లి చూడగా గుర్తుతెలియని మహిళ (40) కాలిపోతూ కనిపించారు. దీంతో వారు వెంటనే మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయి మహిళ మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు చేరుకొని విచారించారు. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్కు మృతదేహాన్ని తరలించారు. కాగా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ఎవరైనా పెట్రోల్ పోసి పరారయ్యారాననే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జొన్నవాడ ఆర్చి వద్ద రోడ్డు పక్కన
గుర్తించిన స్థానికులు
కాపాడేలోపే పూర్తిగా దహనమై..
అనుమానాస్పద మృతిగా
కేసు నమోదు చేసిన పోలీసులు


