● తడిచిన పొగాకు బేళ్లు
● నేలరాలిన మామిడి, నిమ్మకాయలు
● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
ఆత్మకూరు: నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, మేఘాలు కమ్ముకొని వర్షం బీభత్సం సృష్టించింది. ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, చేజర్ల మండలాల్లో ఈదురుగాలుల ధాటికి కోత దశలో ఉన్న మామిడి, నిమ్మకాయలు నేలరాలయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు గోడౌన్లో రేకులు దెబ్బతినడంతో బేళ్లు తడిచి దెబ్బతిన్నాయి. దీంతో రైతులు మిగిలిన వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హడావుడిగా చేరుకున్నారు. చేజర్ల మండలంలోని బోడిపాడు, కాకివాయి, కందాపురం, ఆదూరుపల్లి, మడపల్లి గ్రామాల్లోని మామిడి కాయలు ఈదురుగాలులకు నేలరాలాయి. ఆదూరుపల్లి – చేజర్ల మార్గాల్లో చెట్లు, స్తంభాలు విరిగి పడ్డాయి. సంగం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలువురి ఇళ్ల రేకులు వడగండ్ల ధాటికి దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


