వైద్య చికిత్సకు ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

వైద్య చికిత్సకు ఆర్థిక సాయం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

ఉదయగిరి: ఉదయగిరి పంచాయతీ మాజీ ఉప సర్పంచ్‌, మాజీ ఎంపీటీపీ సభ్యుడు ఉప్పుటూరి హరి కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన వెన్నెముక శస్త్రచిక్సిత్సకు అవసరమైన రూ.4 లక్షలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తన చేజర్ల ట్రస్టు ద్వారా అందజేశారు. ఉదయగిరిలో హరిని ఆదివారం సుబ్బారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట నేతలు దస్తగిరి అహ్మద్‌, సీఎం ఓబులరెడ్డి, సయ్యద్‌ గౌస్‌మెయిద్దీన్‌, కె.నారాయణరెడ్డి, షేక్‌ జాఫర్‌ అహ్మద్‌, ఎంఏ రియాజ్‌, షావురారి ఎంఏ సలీం, మట్ల హరి, ఉప్పుటూరి రమణ, షాయుక్‌ తదితరులున్నారు.

మతిస్థిమితం లేని

మహిళపై లైంగికదాడి

మనుబోలు: మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి లైంగికదాడి చేసిన ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ కొంతకాలంగా కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆమైపె దాడి చేయడమే కాకుండా లైంగికదాడికి పాల్పడినట్లుగా ఓ దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పొదలకూరు సీఐ వెంకట్రావు, మనుబోలు ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

నేడు

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా సర్కిల్‌ పరిధిలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయాలని కోరారు.

● తిరుపతిలో ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమం సోమవారం జరుగుతుంది. 89777 – 16661 నంబర్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్‌ చేసి సమస్యలు చెప్పొచ్చు.

ఈత కొట్టేందుకు వెళ్లి..

నేలబావిలో మునిగిపోయి

బాలుడి మృతి

చిట్టమూరు: సరదాగా స్నేహితులతో కలిసి నేలబావిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు గల్లంతై మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని యాకసిరి పంచాయతీ మంగళకండ్రిగ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఓజిలి మండలంలోని ఓజిలి దళితవాడకు చెందిన కనుపూరు శోభన్‌బాబు (15) స్నేహితులతో ఈత కొట్టేందుకు శనివారం మంగళకండ్రిగ గ్రామం వద్దకు వచ్చాడు. నేలబావిలో ఈత కొట్టే సమయంలో లోతు ఎక్కువగా ఉండటంతో శోభన్‌బాబు గల్లంతయ్యాడు. స్నేహితులు అతడి కోసం వెతికినా దొరక్కపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. శోభన్‌బాబు ఇంటికి రాలేదని ఆందోళన చెందిన తండ్రి శేఖర్‌బాబు ఆదివారం ఉదయం స్నేహితులను గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తెలియజేశారు. శేఖర్‌ పోలీసులను ఆశ్రయించాడు. నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి నేలబావిలో ఉన్న నీటిని తోడి శోభన్‌బాబు మృతదేహాన్ని వెలకి తీశారు. చిట్టమూరు ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement