వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోమటికుంట్ల శివ మార్కాపురం జిల్లా పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి వెళ్లి శనివారం రాత్రి తిరిగొస్తున్నాడు. బొట్లగూడూరు ప్రాంతంలోని ఓ జ్యూస్ షాపులో మజ్జిగ తాగుతున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుగోపాల్ వచ్చి శివ వైపు చూస్తూ గట్టిగా కేకలు వేశాడు. శివ ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికి తోపులాటకు దారితీయగా కొబ్బరి బోండాలు కొట్టేందుకు ఉపయోగించే కత్తిని తీసుకున్న వేణుగోపాల్.. శివ గొంతు భాగంపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు వెంటనే పామూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


