నెల్లూరు(అర్బన్): మలేరియా రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. జూన్ను మలేరియా నివారణ మాసోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా నివారణ విభాగ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. వైద్యశాఖ చేపడుతున్న చర్యలు, ప్రజల చైతన్యంతో జిల్లాలో మలేరియా కేసులు దాదాపు తగ్గిపోయాయని తెలిపారు. అక్కడక్కడా నమోదవుతున్న ఒకట్రెండు కేసులను సైతం అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టామని వివరించారు. మలేరియాపై అవగాహన కల్పిస్తూ వైద్యశాఖ కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి వైద్యశాఖ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం, అసిస్టెంట్ అధికారి జయరామ్ తదితరులు పాల్గొన్నారు.


