
సీఐడీ కేసులో కాకాణికి జూలై 2 వరకు రిమాండ్
నెల్లూరు (లీగల్): సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చి బాపట్ల పరిధిలోని ఏపీ సీఐడీ సిట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం గోవర్ధన్రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై నెల్లూరు రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ పోలీసులు ప్రవేశ పెట్టారు. సీఐడీ పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మి తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు కాకాణికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి శారదారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఎస్ సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత వారంలో ఈ కేసులోని ఆరోపణలు ఎదురుకొంటున్న మొదటి నిందితుడు నిరంజన్రెడ్డి రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరిస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ న్యాయమూర్తి పాలమంగళం వినోద్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.