
ఆటోలో నుంచి జారిపడి..
● 108 ఉద్యోగి మృతి
సీతారామపురం: మండలంలోని బసినేనిపల్లి గ్రామం వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగి ఓంకారం వెంకటనారాయణ రాజు (38) ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సోమవారం 108లో నైట్ డ్యూటీ చేసిన వెంకటనారాయణరాజు మంగళవారం ఉదయం తన బంధువులు అనారోగ్యానికి గురికావడంతో వారిని ఉదయగిరిలోని ఆస్పత్రిలో చూపించేందుకు ఆటోలో బయలుదేరాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజు మార్గమధ్యలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉదయగిరికి తరలించారు.