
జిల్లాలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, ప్ర
యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ
నిత్యం తవ్వి..వందల వాహనాల్లో తరలింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో కొండలను పిండి చేయడంతో పాటు పొలాలు, చెరువులను అగాధాలుగా మారుస్తున్నారు. ప్రకృతిని ధ్వంసం చేసి కోట్లాది రూపాయలను దోచుకుని జేబులు నింపుకొంటున్నారు. అదే సామాన్యుడు సొంత అవసరాల కోసం తట్టమట్టి కూడా తోలుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో గ్రావెల్ దందా జరిగిందని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ప్రస్తుతం అదే దోపిడీ కొనసాగిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నాయి. జిల్లా అధికారులు సైతం సహజ వనరుల దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారే తప్పా నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు.
కావలిలో ఆగని దందా
జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం కావలి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పగలు, రాత్రి తవ్వకాలు సాగిస్తున్నారు. కావలి పెద్దచెరువుతో పాటు రుద్రకోట, అల్లూరు మండలం నార్తుఆములూరు, దగదర్తి మండలం ఉలవపాళ్ల, తదితర ప్రాంతాల్లో గ్రావెల్దందా నిర్విరామంగా సాగుతోంది. కావలి మండలం కొత్తపల్లి, తాళ్లపాళెం, చలంచర్ల చెరువులను సైతం గుల్ల చేస్తున్నారు.
సర్వేపల్లిలో భారీ ఎత్తున..
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఫిర్యాదులు అందితే కొద్దిరోజులు ఆపి ఆ తర్వాత యథావిధిగా కొనసాగిస్తున్నారు. వెంకటాచలం మండలంలో భారీ ఎత్తున గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రిక నుంచి అదానీ కృష్ణపట్నం పోర్టుకు స్వయంగా ప్రధాన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార ఒత్తిళ్లతో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇరిగేషన్ చెరువులే లక్ష్యంగా..
కందుకూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. అధికార పార్టీ అండదండలతో ఇష్టారీతిన గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, కందుకూరు మండలాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఉలవపాడు మండలంలోని ఇరిగేషన్ చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎల్.రాజుపాళెం చెరువులో గ్రావెల్ తవ్వకాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు పెద్దఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీని గురించి ఇరిగేషన్ అధికారులు సమాచారం ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చెరువుల్లోనూ ఇష్టారీతిన తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మట్టిమాఫియాకు అండదండలు అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కందుకూరు మండలం కొండికందుకూరులోని కుంట నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్వయంగా సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్ననాథుడు లేడు. అలాగే లింగసముద్రం మండలం మాలకొండరాయునిపాళెం చెరువు నుంచి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాను వేస్తున్న రోడ్డుకు భారీగా మట్టి తవ్వకాలు జరిపాడు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి విక్రయించుకుంటున్నారు. అయినా ఇరిగేషన్శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై..
ఉదయగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపైన గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. పేదలు తమ కనీస అవసరాల కోసం గ్రావెల్ తోలుకోవాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం రేయింబవళ్లు అనుమతులు లేకుండా లేఅవుట్లకు గ్రావెల్ను తరలిస్తూ దోచేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయితీకి గండిపడుతోంది. ఉదయగిరిలోని చెరువుల నుంచి ఇటుకబట్టీలు, లేఅవుట్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. దుత్తలూరుతోపాటు నందిపాడు, తదితర గ్రామాల్లో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. వింజమూరు మండలం పాతూరు, యర్రబల్లిపాళెం చెరువుల నుంచి పెద్ద మొత్తంలో గ్రావెల్ను లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెం, కమ్మవారిపాళెం, తదితర ప్రాంతాల్లో లేఅవుట్ల కోసం గ్రావెల్ను తరలిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో పిల్లాపేరు బ్రిడ్జికి అతి సమీపంలో గ్రావెల్ను తరలిస్తుండటంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడి వంతెన మనుగడ ప్రమాదకరంగా మారింది.

జిల్లాలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, ప్ర

జిల్లాలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, ప్ర