
రామతీర్థం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కోవూరు: జిల్లాలోని శైవ క్షేత్రాల్లో అతిపురాతన, ఎంతో ప్రాశస్త్యం కలిగిన విడవలూరు మండలం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు విశేషాభిషేకాలు, పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవ వివరాలు
17న ధ్వజారోహణం, శేషవాహనోత్సవం, 18న చిలక వాహనం, 19న హంస వాహనం, 20న పులి వాహనం, 21న రావణసేవ, 22న నందిసేవ, 23న రథోత్సవం, 24న కల్యాణోత్సవం, గజవాహనోత్సవం నిర్వహించనున్నారు. 25న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), రాత్రికి తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, 26న ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, కల్యా ణోత్సవం, తీర్థవాది ఘట్టాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఐఅండ్పీఆర్ డీడీగా
శివశంకర్
నెల్లూరు(అర్బన్): జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) డీడీగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శివశంకర్రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ ఆవరణంలోని ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా పనిచేసిన సదాశివరావు విశాఖపట్నానికి బదిలీ అయ్యారు. నూతన డీడీ శివంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
నకిలీ ఇళ్ల పట్టాలపై
సమగ్ర విచారణ
సీతారామపురం : మండలంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పంపిణీ చేయడంపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీతారామపురంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై‘సాక్షి’లో సోమవారం కథనం వెలువడిన విషయం తెలిసిందే. అందుకు స్పందించిన తహసీల్దార్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, సూత్ర, పాత్రధారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నకిలీ పట్టాలపై నిశితంగా విచారణ చేపడుతున్నామని, త్వరలోనే సూత్రధారులను పట్టుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించి రహస్య విచారణ జరుపుతున్నామన్నారు. కార్యాలయ స్టాంపులు నకిలీ ఇళ్ల పట్టాలపై ఎలా వేశారన్న దానిపైన, ఈ వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు మాయగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు.
ఫేక్కాల్స్ నమ్మి పన్నుల
చెల్లింపులు చేయొద్దు
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పన్నులను క్యూఆర్ కోడ్ ద్వారా సులభతరంగా చెల్లించొచ్చు అంటూ కొందరు ఆగంతకులు ఫేక్కాల్స్ చేసి ప్రజలను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కాల్స్ను నమ్మి చెల్లింపులు చేసి మోసపోవద్దని కమిషనర్ వైఓ నందన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల పొగతోటలోని ఓ ఆస్పత్రిని ఆగంతకులు ఫేక్ కాల్ ద్వారా సంప్రదించి, ట్రేడ్ లైసెన్స్ను తాము పంపుతున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సులభతరంగా చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ఆస్పత్రి నిర్వాహకులకు అనుమానం వచ్చి తమ దృష్టికి తీసుకొచ్చారని కమిషనర్ వివరించారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన అన్ని పన్నులను ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక సచివాలయాల్లోనూ, అదేవిధంగా ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చని తెలిపారు. గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ తదితర మాధ్యమాల ద్వారా చెల్లింపులు చేయమని డిమాండ్ చేస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 18004251113 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

రామతీర్థం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రామతీర్థం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ