
వైభవంగా వెంగమాంబ గ్రామోత్సవం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నర్రవాడలోని ఆలయంలో వెంగమాంబ, గురవయ్య దంపతులకు విశేషాభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయినా వడ్డిపాళెంలోని రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం, తదితర గ్రామాల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండుకొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కూడా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.