
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): చిత్తూరుకు చెందిన స్వరూప్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకుని మోసగించారని దగదర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 23 మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. నెల్లూరు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 70 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఆయన చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో లీగల్ అడైజ్వర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ– 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కోవూరుకు చెందిన రోహిత్ నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6 లక్షలు తీసుకుని మోసగించాడని కోవూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● నా భర్త మరణానంతరం చిన్నకుమారుడు, కోడలు తిడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. కౌలు డబ్బులు, ఇంటి కాగితాలు తీసుకుని నా బాగోగులను పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలని కావలి రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ కోరారు.
● చెడు అలవాట్లకు బానిసైన నా భర్త నా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. నాతోపాటు నా పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నా భర్త మరణించాడు. ఇందుకూరుపేటకు చెందిన ఎ.శీనయ్య నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అసభ్యంగా తిడుతూ వేధిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు.
● నా తమ్ముడు కొంతకాలం కిందట తప్పిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకూ ఆచూకీ తెలియజేయలేదు. తగిన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 ఫిర్యాదులు