
ఎంపీపీపై చర్యలు చేపట్టాలంటూ..
● కలెక్టర్కు వైఎస్సార్సీపీ
నాయకుల వినతి
నెల్లూరు(అర్బన్): ఆత్మకూరులో శిథిలావస్థకు చేరిన పూర్వపు ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేత సందర్భంగా అక్రమంగా టేకు తదితర ఖరీదైన కలపను తరలించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) కేతా వేణుగోపాల్రెడ్డిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నేతలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, బోలిగర్ల వెంకటేశ్వర్లు, బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవనాన్ని ఇటీవల రూ.1.68 లక్షలు ఖర్చుతో అధికారులు కూల్చివేయించారన్నారు. అందులో ఉన్న ఖరీదైన కలపను వేణుగోపాల్రెడ్డి అధికారుల అనుమతి లేకుండానే తన స్వగ్రామమైన చెర్లోయడపల్లికి తరలించాడన్నారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో తాము ఎంపీడీఓను ప్రశ్నించామన్నారు. దీంతో ఎంపీపీ గత సర్వసభ్య సమావేశంలో అనుమతి పొందారంటూనే కలప తన పరిధిలోనిది కాదని పంచాయతీరాజ్ ఏఈ పరిధిలోకి వస్తుందని తెలిపారన్నారు. దీనిపై మళ్లీ కథనాలు రావడంతో ఎంపీపీ కలపను ఈనెల 7వ తేదీన ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగి చేర్చారన్నారు. అందులో ఖరీదైన 70 శాతం కలప మాయమైందని, 30 శాతం మాత్రమే తిప్పి పంపారన్నారు. ఈ కొంచెం కలపను ఈనెల 18న వేలానికి పెడుతున్నట్టు అధికారులు తెలిపారన్నారు. కలెక్టర్ స్పందించి మిగతా 70 శాతం కలపను రికవరీ చేయించాలని, అక్రమంగా తరలించిన ఎంపీపీపై, సహకరించిన ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు చేపట్టాలని, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. దీనికి ఆనంద్ సానుకూలంగా స్పందించారు.