
ఇళ్ల నిర్మాణంపై ప్రతి వారం సమీక్షలు
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(అర్బన్) : ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఎంపీడీఓలు ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషలాఫీసర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న ప్రజల అభిప్రాయాలను సచివాలయ సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రతి వారం కనీసం 70 శాతం పనులు తగ్గకుండా చూడాలన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ఆధార్కార్డులు అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, కార్పొరేషన్ కమిషనర్ నందన్, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ మోహన్రావు, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్రావు, గంగాభవాని, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.