
ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రి
ఉదయగిరి రూరల్: ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రిని కొంతమంది యువకులు గుర్తించారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి. ఉదయగిరి పట్టణానికి చెందిన యువకులు శనివారం రాత్రి దుర్గంపై ఉన్న పెద్ద మసీదు వద్దకు నిద్రించేందుకు వెళ్లారు. వారు మసీదు వద్దకు వెళ్తున్న సమయంలో రామ్, కరీం బుగ్గ ప్రాంతంలో దీపాల వెలుతురు రావడం, వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తుండడాన్ని గమనించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లేందుకు యువకులు భయపడ్డారు. ఆదివారం తిరిగి ఇళ్లకు బయలుదేరారు. వచ్చే సమయంలో శనివారం రాత్రి దీపాలు వెలుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లో పేలుడు సామగ్రి, భోజనం చేసే ప్లేట్లు తదితరాలను గుర్తించారు. రాత్రి ఆ ప్రాంతంలో ఉన్నది గుప్తనిధుల ముఠాయేనని నిర్ధారించుకుని అక్కడి నుంచి కిందకు పరుగులు తీశారు. గతంలో కూడా దుర్గం కొండపై గుప్తనిధుల తవ్వకాలు జరిపే సమయంలో పేలుడు సంభవించి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు.