తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు

Jun 16 2025 7:05 AM | Updated on Jun 16 2025 7:05 AM

తల్లి

తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క హామీని తుంగలో తొక్కుతోంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఆ పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకానికి వీలైనంత మంది విద్యార్థులను తగ్గించేందుకు రకరకాల నిబంధనలు అమలులోకి తెచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా పేద విద్యార్థులను అనర్హుల జాబితాలో చేర్చినట్లు విమర్శలు వస్తున్నాయి.

1 నుంచి ఇంటర్‌ వరకు

4.51 లక్షల మంది విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా

2.42 లక్షల వరకు అర్హులు

అనర్హుల జాబితాలోకి

లక్షలాది పేద విద్యార్థులు

ఒక్కొక్కరికి

రూ.15వేలు ఇస్తామని హామీ

కానీ విద్యార్థి తల్లి

అకౌంట్‌లో రూ.13 వేలే జమ

స్కూల్‌ మెయింటెనెన్స్‌ పేరుతో రూ.2వేలు ఎగవేత

సచివాలయాల చుట్టూ

తల్లిదండ్రుల ప్రదక్షిణలు

నెల్లూరు (టౌన్‌): జిల్లా వ్యాప్తంగా 3,453 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 3.92 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 59 వేల మంది ఉన్నారు. మొత్తం దాదాపు 4.51 లక్షల మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15వేలు తల్లి అకౌంట్‌లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పథకానికి విద్యార్థుల సంఖ్య తగ్గించుకునేందుకు రకరకాల నిబంధనలు ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. నెలకు 300 యూనిట్లు విద్యుత్తు వినియోగం, సొంతకారు ఉన్నా, కుటుంబ ఇన్‌కం పట్టణాల్లో నెలకు రూ.12వేలు, గ్రామాల్లో రూ.10 వేలు, మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించకూడదని, పట్టణాల్లో 1000 చదరపు అడుగులు మించి స్థలం ఉండకూడదని, ఇన్‌కం టాక్స్‌ చెల్లించినా, పాఠశాలలో హాజరు 75 శాతం ఉండాలని తదితర నిబంధనలను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

2.40 లక్షల మందికే తల్లికి వందనం

ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తేమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సుమారు 4.51 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాల్లో అర్హుల, అనర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 2.42 లక్షల మంది విద్యార్థులకే తల్లికి వందనం అమలు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరికే అకౌంట్లలో డబ్బులను జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల కారణంగా దాదాపు మరో లక్ష మందికి పైగా పేద విద్యార్థులు ఈ పథకానికి దూరం అవుతున్నారని తెలుస్తోంది. అర్హులై ఉండి అనర్హుల జాబితాలో పేరు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలను ఈనెలాఖరులోగా అప్‌లోడ్‌ చేయాలని సూచిస్తున్నారు.

అకౌంట్‌లో రూ.13వేలు జమ

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అయితే రూ.13 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. మిగిలిన రూ.2వేలు స్కూల్‌ మెయింటినెన్స్‌కు కట్‌ చేశారని చెబుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.1000 తగ్గించి మిగి లిన రూ.14వేలు అకౌంట్‌లో జమ చేస్తే అప్పుడు చంద్రబాబునాయుడు, లోకేశ్‌ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.2వేలు ఎందుకు తీసుకుంటున్నా రని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతు న్నారు. నిబంధనల పేరుతో కొంతమందికే డబ్బులు జమచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మ ఒడి నగదు

ఈ నెలాఖరులోపు పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి

తల్లికి వందనం పథకంలో భాగంగా అర్హులు, అనర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శించారు. అనర్హుల జాబితాలో ఉన్న వారు ఎందుకు అలా ప్రకటించారో పక్కన కారణాన్ని స్పష్టంగా చూపించారు. అర్హులై ఉండి అన్ని పత్రాలు అప్‌లోడ్‌ చేయని వారు ఈ నెలాఖరు లోపు ఆ పత్రాలను సచివాలయంలో అప్‌లోడ్‌ చేస్తే వారికి కూడా వారి అకౌంటులో డబ్బులు జమ చేస్తారు.

– బాలాజీరావు, డీఈఓ

తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు 1
1/1

తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement