
ఉదయగిరి దుర్గంపై కూంబింగ్
ఉదయగిరి: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో ఉన్న ఉదయగిరి దుర్గంపై ఆదివారం అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. శనివారం రాత్రి దుర్గంపై ఉన్న పెద్దమసీదు ప్రాంతంలో దీపాలు వెలుగుతూ కనిపించడంతో గుప్తనిధుల ముఠా సంచరిస్తుందనే అనుమానంతో కూంబింగ్ చేపట్టారు. స్థానిక అటవీ శాఖ అధికారులతో పాటు సైక్లింగ్ఫోర్స్ కలిసి దుర్గంపైకి వెళ్లారు. చిన్నమసీదు, పెద్దమసీదు, గుర్రపుశాలలు, మెట్ల మార్గం తదితర ప్రాంతాలలో పరిశీలన జరిపారు. ఎలాంటి తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు లేవని అటవీ సిబ్బంది తెలిపారు. కాగా స్థానికులు కొందరు దుర్గంపైన ఉన్న పెద్దమసీదు వద్ద శనివారం రాత్రి లైట్లు ఏర్పాటు చేసి విందు భోజనాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.