
అవును.. అతను కుర్చీ వదలడు
అంతా నా ఇష్టం
11 ఏళ్లుగా ఒకే సీటులో సీనియర్ అసిస్టెంట్
● నెల్లూరులోనే 30 ఏళ్లుగా విధులు
● అధికార పార్టీ అండదండలతోనే..
● ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సీటు మార్చని అధికారులు
● నేటి నుంచి పెద్దాస్పత్రి, మెడికల్
కళాశాలలో బదిలీల ప్రక్రియ
● ఆస్పత్రిలో పనిచేసే సుమారు 20 మంది స్టాఫ్ నర్సులు ఆపరేషన్లలో పాల్గొన్నందుకు ఆరోగ్యశ్రీ కింద రూ.4 వేల నుంచి రూ.7 వేలు వరకు ఒక్కొక్కరికి 2023లో ఇన్సెంటివ్స్ రావాలి. ఆ నిధులను నర్సుల బ్యాంక్ ఖాతాల్లో వేశామని ఆ సీనియర్ అసిస్టెంట్ చెబుతున్నారు. బ్యాంక్ వారు తమకు వేయలేదని అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎవరు తిన్నారో తెలియదు. బ్యాంకు ఖాతాకు జమ చేసి ఫెయిలైతే అకౌంట్ వివరాలు తీసుకుంటే సరిపోతుంది. అది కూడా చేయలేదు. నాలుగు నెలల నుంచి నర్సులు తమకు సంబంధించిన నగదు గురించి అడుగుతున్నా సమాధానం లేదు.
● గతంలో బినామీ ఏజెన్సీ పేరుతో ఇంటర్నెట్ బిల్లులు భారీగా చెల్లించారనే ఆరోపణలున్నాయి.
● ఒకటికి మూడు కంపెనీల సెల్ టవర్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్నాయి. ఏళ్ల తరబడి వాటికి ఆయా కంపెనీలు ఒక్క రూపాయి అద్దె చెల్లించలేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో–ఆర్డినేటర్ లక్ష్మీసునంద ఈ విషయమై పోరాడి కొంతవరకు సెల్టవర్ కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేయించారు. అధికారం మారాక బ్యాలెన్స్ డబ్బులు నేటికీ జమ కాలేదు.
● తనకు లంచం ఇవ్వకపోయినా.. తనకు నచ్చకపోయినా ఆ సీనియర్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులు పెడతారు. అందులో భాగంగా సూపరింటెండెంట్కు కారు అద్దెకు పెట్టిన కాంట్రాక్టర్కు 9 నెలలుగా అద్దె చెల్లించలేదు. దీంతో అతను కలెక్టర్కు అర్జీ పెట్టారు. దీంతో కాంట్రాక్టర్కు ఇచ్చిన చెక్కులో అంకెలు కరెక్ట్గా వేసి అక్షరాల్లో ఒకచోట తప్పు రాశారు. ఆ చెక్కును బ్యాంక్లో జమ చేయగా చెల్లలేదు. మళ్లీ కాంట్రాక్టర్ విషయం తెలుసుకుని చెక్కును తెచ్చి ఆ సీనియర్ అసిస్టెంట్కు ఇచ్చి సరి చేయమని కోరారు. ఇందుకు ఇన్చార్జి సూపరింటెండెంట్ కూడా త్వరగా లోపాన్ని సరి చేయమని పదేపదే చెప్పినా ఆ సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్టర్ను ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆఫీసులో కూర్చోబెట్టుకున్నాడు. తీరా రిజిస్టర్ కనబడలేదు. సంతకం చేయాలి. రేపు రావాలని చెప్పాడు. దీంతో కాంట్రాక్టర్ అక్కడి నుంచి కదలకపోవడంతో సాయంత్రం 6 గంటలకు చెక్కు ఇచ్చారు.
● ఆరోగ్యశ్రీకి సంబంధించిన రెండు చెక్కుల్లో కూడా ఇలాగే అంకెలు కరెక్ట్గా వేసి, అక్షరాల్లో మధ్యలో ఒకచోట తప్పు రాశాడు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయినా ఆయన్ను అక్కడి నుంచి కదిలించేందుకు అధికారులు సిద్ధపడటం లేదు.
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యశాఖలో ఇప్పటికే సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో అధికార పార్టీ నేతల సిఫార్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సోమవారం నుంచి జిల్లా సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి), ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయితే ఒకరిద్దరు ఏళ్ల తరబడి తమ సీటు వదలడం లేదు. అధికారులు వారిని బదిలీ చేయలేకపోతున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 11 ఏళ్లుగా ఓ సీనియర్ అసిస్టెంట్ సీటుకు అతుక్కుపోయారు. అధికార పార్టీ అండదండలు, లంచాలతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన తన ఉద్యోగకాలంలో గతంలో నగరంలోని టీబీ ఆస్పత్రిలో 20 ఏళ్లు పనిచేశాడు. టీబీ ఆస్పత్రిని పెద్దాస్పత్రిలో కలిపేశాక 11 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. అంటే తన సర్వీసులో నెల్లూరును వదిలి పెట్టలేదు.
ఆరోపణలెన్నో..
ప్రభుత్వాస్పత్రిలో పేరుకే సీనియర్ అసిస్టెంట్. అయితే మొత్తం పనులన్నీ ఆయనే చక్కబెడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఆఫీసులో ఏ ఫైలు కదలాలన్నా ముందుగా ఆ సీనియర్ అసిస్టెంట్ చేయి తడపందే పనులు కావనే ఆరోపణలున్నాయి. లంచాలిస్తే ఆ ఫైల్కు తక్కువ సమయంలోనే మోక్షం కలుగుతుంది. లేకుంటే ఇబ్బంది పెడుతారనే విమర్శలున్నాయి. మెడికల్ బిల్లులు, ఉద్యోగులకు మెడికల్ సర్టిఫికెట్లు డబ్బులిస్తే చేస్తారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా సొంత స్టాఫ్ విషయంలో, డాక్టర్ల విషయంలో పనులు జరగవనే ప్రచారం ఉంది.
లేఖ తెచ్చుకుని..
ఆ సీనియర్ అసిస్టెంట్ తనను బదిలీ చేయకుండా అసోసియేషన్ తరఫున సిఫార్సు లేఖ తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీఓ ప్రకారం అది పనికి రాదు. అయినా దానిని అడ్డుపెట్టుకుని, అధికార పార్టీ నాయకుల అండతో కదిలేందుకు సిద్ధపడటం లేదు. అధికారులు కనీసం సీటు కూడా మార్చడం లేదు. ఇలాంటి లోపాలతో ఉన్న వారిని మార్చకుండా ఎలా పారదర్శకంగా బదిలీలు చేస్తారో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వ పెద్దాస్పత్రి

అవును.. అతను కుర్చీ వదలడు