
స్వర్ణాల చెరువు ఆక్రమణకు యత్నం
నెల్లూరు సిటీ: స్వర్ణాల చెరువుపై తెలుగు తమ్ముళ్ల కళ్లు పడ్డాయి. నెల్లూరులో ప్రతిష్టాత్మకమైన ఈ చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలిసినా అధికార పార్టీ నేతలు కావడంతో మిన్నకుండిపోయారని విమర్శలున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్లో ప్రగతినగర్ ఏబ్లాక్ 10వ వీధి చివర స్వర్ణాల చెరువు విస్తరించి ఉంది. దాదాపు 400 అంకణాల చెరువు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేత రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి 100 అంకణాల స్థలంలో పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. మట్టి తోలించి చదును చేయిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా..
జేసీబీతో చదును చేస్తున్న వారిని స్థానికులు ప్రశ్నించగా మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని, టీడీపీ ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాధానమిచ్చారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని సదరు నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్లాట్లు చేసి విక్రయాలు
చెరువు స్థలాన్ని చదును చేసి 9 అంకణాల లెక్కన ప్లాట్లుగా వేసి విక్రయాలు చేసేందుకు టీడీపీ నేత స్కెచ్ వేశారని ప్రచారం ఉంది. అధికార పార్టీ కావడంతో అడిగేవారు లేరని బరితెగిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
రంగంలోకి టీడీపీ నేత
జేసీబీతో పిచ్చిమొక్కల తొలగింపు
చోద్యం చూస్తున్న
ఇరిగేషన్ అధికారులు