
ఆరోగ్య రంగం నిర్వీర్యం
నెల్లూరు(అర్బన్): ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్ విరించి అన్నారు. నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సు ఆదివారం జరిగింది. జనవిజ్ఞానవేదిక, డాక్టర్ రామచంద్రారెడ్డి ఆస్పత్రి, ప్రజారోగ్యవేదిక, మెడికల్ రెప్స్ యూనియన్, యూటీఎఫ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – పర్యవసానాలు అనే అంశంపై విరించి మాట్లాడారు. పేదలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా తెస్తున్న 12 వైద్య కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని బహిరంగంగా ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇదే జరిగితే సామాన్య పిల్లలు వైద్యవిద్యను ఎక్కడ అభ్యసించాలని ప్రశ్నించారు.
● భారత రాజ్యాంగం పూర్వాపరాలు, సవాళ్లు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగ మూలస్తంభాలపైనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఎలక్షన్ కమిషన్, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో అసమానతలు పెంచుతూ తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణయ్య, సతీష్, మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.