
వరండాలో నిద్రిస్తుండగా ఇంట్లో చోరీ
● 15 సవర్ల బంగారంతో పాటు రూ.50 వేల నగదు అపహరణ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 15 సవర్ల బంగారంతో పాటు రూ.50 వేలు నగదును దోచేశారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆమర్లపూడి మాల్యాద్రి– వరలక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి వరండాలో ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. అయితే ఇంటి ప్రధాన తలుపునకు తాళం వేయకుండా గడిపెట్టి వదిలేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ దొంగలు ఎత్తుగా ఉన్న ప్రహరీ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లారు. బెడ్రూమ్లో ఉన్న బీరువాను కట్టర్తో కటింగ్ చేసి అందులో ఉన్న 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును దొంగతనం చేశారు. కాగా అర్ధరాత్రి వేళలో ఇంటిలో శబ్ధం వచ్చినట్లు భార్య వరలక్ష్మి భర్తను లేపి చెప్పింది. నిద్రమత్తులో ఉన్న అతను ఫ్యాన్ శబ్ధం కావచ్చు అంటూ లేవలేదు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మాల్యాద్రి లేచి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండడం, వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు స్వీకరించింది. కాగా ఆ రాత్రి దొంగలు ముందుగా ఓ రేకుల ఇంట్లో ప్రవేశించి వెతికారు. ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న మాల్యాద్రి ఇంట్లో దొంగతనం చేశారు. ఎస్సై వీరప్రతాప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ఓ సారి
కొద్ది రోజులు క్రితం ఇదే గ్రామంలో పట్టపగలు దొంగలు ఓ ఇంట్లో ప్రవేశించి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు నగదు అపహరించిన ఘటన మరువక ముందే మరోసారి చోరీ జరగడంతో గ్రామస్తులు అందోళన చెందుతున్నారు.