
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణం టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని- విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2008 తర్వాత అక్కడ నో విన్!
అయితే, ఇందుకు మరో కారణం.. వేదిక. అవును.. సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియం ఈ హై రేంజ్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఆరంభ సీజన్లో అంటే 2008లో తొలిసారి గెలిచిన ఆర్సీబీ.. ఇంత వరకు ఒక్కసారి కూడా మళ్లీ గెలుపు రుచిచూడలేదు. ఇప్పటి వరకు చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్లు ఆడి అన్నింటా ఓటమిపాలైంది.
ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటి వరకు చెన్నైతో జరిగిన 33 మ్యాచ్లలో 11 మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్లో అందరి దృష్టి ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లి మీదే కేంద్రీకృతమై ఉంది. జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం సీఎస్కే మీద మెరుగై రికార్డు కలిగి ఉన్నాడు.
ఇప్పటి వరకు సీఎస్కే 33 మ్యాచ్లలో ఆడిన కోహ్లి 1053 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియా ముందుకు వచ్చిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోహ్లితో ప్రమాదం ఉందని భావిస్తున్నారా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికి ఒక్క మ్యాచ్ ఆడింది. దానిని బట్టి ఇప్పుడే అంచనాకు రాలేము.
కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదే
గతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే- ఆర్సీబీ సరికొత్తగా ఉన్నాయి. గత రికార్డుల గురించి ప్రస్తావన అప్రస్తుతం. ఏదేమైనా ఆర్సీబీకి కోహ్లి అత్యంత కీలకమైన ఆటగాడు. వాళ్ల జట్టు కూడా గతం కంటే మరింత పటిష్టంగా మారింది.
ఒకవేళ మేము కోహ్లి, పాటిదార్లను కట్టడి చేయగలిగితే.. అది మా విజయానికి దోహం చేస్తుంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తాజా ఎడిషన్లో ఆర్సీబీ తొలుత డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది.
ఆ మ్యాచ్లో కోహ్లి 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఫలితంగా 16.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి ఆర్సీబీ గెలిచింది.
ఇక సీఎస్కే తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి గతంలో కోహ్లి కెప్టెన్గా వ్యవహరించగా.. చెన్నైని ముందుండి నడిపించిన ధోని.. గతేడాది తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.
చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!