న్యూజిలాండ్ మహిళా క్రికెట్ దిగ్గజం, వెటరన్ ఆల్రౌండర్ సూజీ బేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్-జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు బేట్స్ ప్రకటించింది.
2006లో భారత్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బేట్స్.. తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. 38 ఏళ్ల బేట్స్ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో బేట్స్ తొడ కండరాల గాయం బారిన పడింది. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న బేట్స్.. వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని పట్టుదలతో ఉంది.
20 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జెర్సీ ధరించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ కాలం ఇంత వేగంగా గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన యూకే గడ్డపై మరో ప్రపంచకప్ గెలవడమే నా చివరి లక్ష్యం. అందుకోసం నా శక్తి మొత్తాన్ని ధారపోస్తాను.
ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాను అని బేట్స్ న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. సూజీ బేట్స్ వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఉమెన్స్ క్రికెటర్గా కొనసాగుతోంది. 181 వన్డేల్లో బేట్స్ 5,964 పరుగులు చేసింది.
అదేవిధంగా ఓవరాల్గా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా బేట్స్ (4,717 పరుగులు) కొనసాగుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో 350 మ్యాచ్లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్ సూజీనే కావడం గమనార్హం.
చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?


