మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే | Legendary Spinner Anil Kumble Visits Maha Kumbh Mela With Wife | Sakshi
Sakshi News home page

మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే

Feb 13 2025 11:36 AM | Updated on Feb 13 2025 11:43 AM

Legendary Spinner Anil Kumble Visits Maha Kumbh Mela With Wife

భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే, తన సతీమణి చేతనతో కలిసి ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానం చేశారు. మాఘ పౌర్ణ‌మి సంద‌ర్భంగా కుంబ్లే దంపతులు మహాకుంభ్‌ మేళాలో పాల్గొన్నారు. అమృత స్నానం ఆచరిస్తున్న దృశ్యంతో పాటు పౌర్ణ‌మి చంద్రుడి ఫోటోను, బోటులో భార్య చేతనతో తీసుకున్న సెల్ఫీని కుంబ్లే ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందుకు బ్లెస్డ్‌ అని క్యాప్షన్‌ పెట్టి, మహాకుంభ్‌, ప్రయాగ్‌రాజ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.

కాగా, బుధవారం మాఘ పౌర్ణ‌మి కావడంతో మ‌హాకుంభ్‌కు జ‌నం పోటెత్తారు. నిన్న ఒక్క రోజే రెండు కోట్ల మందికిపైగా పుణ్య స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. మహాకుంభ్‌ను నిన్నటి వరకు దాదాపుగా 50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ పేర్కొన్నారు. మహాకుంభ్‌కు లెక్కలేని సంఖ్యలో జనం పోటెత్తుతుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోకి వాహ‌నాల అనుమతిని నిషేధించారు. ఎక్కడో ఉన్న పార్కింగ్ స్థ‌లం నుంచి ఘాట్ల వ‌ర‌కు జ‌నం న‌డిచి వెళ్తున్నారు.

అనిల్‌ కుంబ్లే విషయానికొస్తే.. 54 ఏళ్ల ఈ దిగ్గజ స్పిన్నర్‌ భారత్‌ తరఫున 132 టెస్ట్‌లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. టెస్ట్‌లు, వన్డేల్లో కలుపుకుని కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు తీశాడు. కుంబ్లేకు ఐపీఎల్‌లో కూడా ప్రవేశముంది. కుంబ్లే ఆర్సీబీ తరఫున 2008-10 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఆటగాడిగా రిటైరైన అనంతరం కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. కుంబ్లే ఆథ్వర్యంలో టీమిండియా చారిత్రక విజయాలు సాధించింది. కుంబ్లే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement