కొంప ముంచిన జైస్వాల్‌.. కట్టలు తెంచుకున్న సిరాజ్‌ ఆగ్రహం! | Jaiswal Drops Duckett At 97 Slams Century Siraj Angry With Him Viral | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన జైస్వాల్‌.. కట్టలు తెంచుకున్న సిరాజ్‌ ఆగ్రహం!.. డకెట్‌ సెంచరీ

Jun 24 2025 7:29 PM | Updated on Jun 24 2025 11:37 PM

Jaiswal Drops Duckett At 97 Slams Century Siraj Angry With Him Viral

PC: X

టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (Ben Duckett) శతక్కొట్టాడు. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో.. 122 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా 2010 తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఓపెనింగ్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

చివరగా 2010లో బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌ టెస్టులో అలిస్టర్‌ కుక్‌ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే.. బెన్‌ డకెట్‌కు టెస్టుల్లో ఇది ఆరో శతకం. నిజానికి.. టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్‌ వైఫల్యం కారణంగానే డకెట్‌ సెంచరీ మార్కు అందుకున్నాడని చెప్పవచ్చు.

జైసూ తప్పిదం..
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 39వ ఓవర్లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో ప్రయత్నంలో షార్ట్‌ బంతిని సంధించంగా.. దానిని ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన డకెట్‌.. బంతిని గాల్లోకి లేపాడు. టాప్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి గాల్లో ఉన్న వేళ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన జైస్వాల్‌ క్యాచ్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు.

సిరాజ్‌ ఆగ్రహం
అప్పటికి డకెట్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని అవుట్‌ చేసే అవకాశాన్ని జైసూ జారవిడవడంతో సిరాజ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరోవైపు.. భారత జట్టు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కూడా అసహనానికి లోనయ్యాడు.

కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో జైస్వాల్‌ క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం ఇది నాలుగోసారి. తొలి ఇన్నింగ్స్‌లో మూడుసార్లు ఇదే తరహాలో జైసూ కారణంగా  ప్రత్యర్థి బ్యాటర్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. 

క్యాచ్‌ విన్‌ మ్యాచెస్‌ అంటారు కదా! కానీ జైసూ ఇలా కీలక సమయాల్లో పదే పదే క్యాచ్‌లు మిస్‌ చేయడం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి! ఒకవేళ వీటి కారణంగా మ్యాచ్‌ ఫలితం గనుక తారుమారైతే జైస్వాల్‌పై విమర్శల జడి కురవడం ఖాయం.

వర్షం వల్ల ఆగిన మ్యాచ్‌
ఇక బ్యాటర్‌గా మాత్రం ఈ యువ ఓపెనర్‌ లీడ్స్‌ టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (101) బాదిన జైసూ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నాలుగు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. 

కాగా భారత్‌ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది. మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో 40.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. 

అప్పటికి ఓపెనర్లు డకెట్‌ 105, జాక్‌ క్రాలే 59 పరుగులతో ఉండగా.. ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. విజయానికి భారత్‌ ఇంకా పది వికెట్ల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్‌ గెలుపునకు 190 పరుగులు అవసరం.
UPDATE: Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి

చదవండి: గిల్‌ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్‌!.. ఆఖరికి మేమే గెలిచాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement