బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా జరగనున్న తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఈ జట్టు కెప్టెన్గా నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యం వహించనున్నాడు. బంగ్లాదేశ్ జట్టు 2003 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్ ఆడనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-26లో భాగంగా జరగనుంది.
కాబట్టి ఈ సిరీస్కు ఇరు జట్లకు కీలకం కానుంది. కాగా ఆల్రౌండర్ సౌమ్య సర్కార్కు చాన్నాళ్ల తర్వాత బంగ్లా టెస్ట్ జట్టులో చోటు దక్కింది. సర్కార్ చివరగా 2021లో బంగ్లా తరపున టెస్టుల్లో ఆడాడు. అదేవిధంగా సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, మోమినుల్ హక్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
పేస్ బౌలింగ్ విభాగంలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ వంటి ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు అన్క్యాప్డ్ పేసర్ ముష్ఫిక్ హసన్కు కూడా తొలిసారి జట్టులో స్థానం లభించింది.
ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.5% పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 58.33% పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్.


