Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి | Ind vs Eng 1st Test Day 5 Leeds: England Beat India By 5 Wickets | Sakshi
Sakshi News home page

Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి

Jun 24 2025 10:58 PM | Updated on Jun 24 2025 11:39 PM

Ind vs Eng 1st Test Day 5 Leeds: England Beat India By 5 Wickets

Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్‌ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.  టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు
బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (42), యశస్వి జైస్వాల్‌ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.

ఆరు పరుగుల ఆధిక్యం
ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జేమీ స్మిత్‌ 40, టెయిలెండర్‌ క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

ఆదుకున్న రాహుల్‌, పంత్‌.. కానీ
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన గిల్‌ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ గిల్‌ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 30 పరుగులు చేశాడు.

ఈ దశలో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (137), రిషభ్‌ పంత్‌ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (4), సిరాజ్‌ (0), బుమ్రా (0), ప్రసిద్‌ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్‌) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది.

శతక్కొట్టిన డకెట్‌
ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్‌ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్‌ నైట్‌ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్‌లో వికెట్‌ నష్టపోకుండా ఆడిన స్టోక్స్‌ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్‌ను పూర్తి చేసింది.

ఓపెనర్లలో జాక్‌ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెన్‌ డకెట్‌ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్‌ (8), హ్యారీ బ్రూక్‌ (0) విఫలమైనా.. జో రూట్‌ (53 నాటౌట్‌), జేమీ స్మిత్‌ (44 నాటౌట్‌) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్‌ స్టోక్స్‌ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్‌ తీయగా.. ప్రసిద్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్‌గా గిల్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- తొలి టెస్టు
🏏షెడ్యూల్‌: జూన్‌ 20- 24
🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 471 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465 ఆలౌట్‌
🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం

🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ లక్ష్యం: 371
🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్‌ బృందం
🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్‌ విజయం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement