
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు.
జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.