కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో తొలి రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ శివ నర్వాల్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు.
240 పాయింట్లతో సోదిక్జోన్ అబ్దుల్లాయెవ్ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్ అభినవ్ దేశ్వాల్ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ పనాహ్ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.


