‘హ్యాట్రిక్‌’పై భారత్‌ గురి | India womens match against Sri Lanka today | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్‌’పై భారత్‌ గురి

May 4 2025 1:23 AM | Updated on May 4 2025 1:23 AM

India womens match against Sri Lanka today

నేడు శ్రీలంకతో మహిళల పోరు  

జోరుమీదున్న హర్మన్‌ సేన 

కొలంబో: ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరుస విజయాల ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పుడు ‘హ్యాట్రిక్‌’ విజయంపై కన్నేసింది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత అమ్మాయిల జట్టు... లంకతో తలపడనుంది. వన్డే క్రికెట్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఓడించడమంటే లంకకు శక్తికి మించిని పనే అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ‘హ్యాట్రిక్‌’ కష్టం కాకపోవచ్చు.  

అన్ని రంగాల్లో ఆధిపత్యం 
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లోను భారత్‌ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ప్రతీక, స్మృతి మంధాన ఫామ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో హర్లీన్‌ డియోల్‌ నిలకడగా రాణిస్తుండగా, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లతో కూడిన మిడిలార్డర్‌ దీటుగా ఉంది. 

బౌలింగ్‌ విభాగంలో ప్రత్యేకించి ఈ సిరీస్‌లో మాత్రం స్పిన్‌ విభాగం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. దీప్తిశర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణిల ఉచ్చులో బ్యాటర్లు చిత్తవుతున్నారు. పేసర్లు కాశ్వీ గౌతమ్, అరుంధతీ పరుగుల పరంగా కట్టడి చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో సఫారీలాంటి గట్టి ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల కంటే కూడా మన ఫీల్డింగే ఎంతో మెరుగ్గా ఉంది. దీంతో భారత్‌ ఎదురు లేని విజయాలతో దూసుకెళుతోంది.  

సఫారీపై గెలిచిన ఉత్సాహంతో... 
మరోవైపు ఆతిథ్య లంక జట్టు గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఉత్సాహంతో ఉంది. హాసిని పెరీరా, హర్షిత, కవిశా దిల్హరి అర్ధసెంచరీలతో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్నందుకున్న శ్రీలంక... ఇదే పట్టుదలను భారత్‌పై కనబరచాలని భావిస్తోంది. కెపె్టన్‌ చమరి ఆటపట్టు, విష్మీ గుణరత్నేలు టాపార్డర్‌లో రాణిస్తే కాస్త మెరుగైన స్కోరు చేయగలుగుతుంది. 

బౌలింగ్‌ దళంలో మాల్కి మదర, సుగంధిక కుమారి, దేవ్‌మి విహంగ, ఐనొక రణవీర నిలకడగా వికెట్లను పడగొడుతున్నారు. అయితే వీరంతా భారత్‌లాంటి మేటి ప్రత్యర్థిపై ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆతిథ్య జట్టు విజయావకాశాలు ఆధారపడివున్నాయి. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: ప్రతిక, స్మృతి, హర్లీన్‌ డియోల్, హర్మన్‌ప్రీత్, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతి, స్నేహ్‌ రాణా, శ్రీచరణి. 
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్‌), హాసిని, విష్మీ, హర్షిత, కవీశ, నీలాక్షిక సిల్వా, అనుష్క సంజీవని, దేవ్‌మి, మాల్కి మదర, సుగంధిక, ఐనొక రణవీర.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement