భారీ సిక్సర్లు బాదిన కోహ్లి- రోహిత్‌.. గంభీర్‌ రియాక్షన్‌ వైరల్‌ | Ind vs SL ODIs: Gambhir Reaction To Rohit Kohli Big Sixes Goes Viral | Sakshi
Sakshi News home page

భారీ సిక్సర్లు బాదిన కోహ్లి- రోహిత్‌.. గంభీర్‌ రియాక్షన్‌ వైరల్‌

Aug 2 2024 12:59 PM | Updated on Aug 2 2024 1:31 PM

Ind vs SL ODIs: Gambhir Reaction To Rohit Kohli Big Sixes Goes Viral

కోహ్లి- గంభీర్‌- రోహిత్‌ (PC: BCCI)

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. వీరితో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

అదే విధంగా.. ఐపీఎల్‌-2024 తర్వాత వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వీరంతా ఇప్పటికే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి వన్డే పూర్తి స్థాయిలో సిద్దమయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. నెట్స్‌లో శ్రమిస్తుండగా.. గంభీర్‌ దగ్గరుండి వారి ప్రాక్టీస్‌ను గమనించాడు. ఇక ఈ ఇద్దరు స్టార్లు భారీ సిక్సర్లతో చెలరేగగా.. గంభీర్‌ నవ్వుతూ వారెవ్వా అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ టీమిండియా అభిమానులను ఆకర్షిస్తోంది.

వీడియోపై స్పందిస్తూ.. ముగ్గురు లెజెండ్స్‌ని ఇలా చూస్తూ ఉంటే కళ్లు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో గౌతం గంభీర్‌ హెడ్‌కోచ్‌గా నియమితుడు కాగానే సీనియర్లకు షాకివ్వడం ఖాయమని.. ముఖ్యంగా కోహ్లికి కష్టాలు మొదలైనట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

అయితే, తన తొలి ప్రెస్‌ మీట్‌లోనే గంభీర్‌ వీటిని కొట్టిపారేశాడు. రోహిత్‌, కోహ్లి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్లని.. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే వన్డే వరల్డ్‌కప్‌-2027 దాకా ఆడగలరంటూ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు జట్టుకు బలం అని.. వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా ఉన్న సమయంలో గంభీర్‌- కోహ్లి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇద్దరు ఆలింగనం చేసుకోవడంతో ఆ వివాదం సమసిపోయినట్లయింది. ఇక ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా ఉన్న గంభీర్‌ ఆ జట్టును విజేతగా నిలిపి.. ఆపై భారత క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement