టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్‌ ఆలౌట్‌ | Ind vs NZ 3rd Test: Jadeja, Sundar Shines New Zealand Bowl Out 235 on Day 1 | Sakshi
Sakshi News home page

Ind vs NZ: టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే న్యూజిలాండ్‌ ఆలౌట్‌

Nov 1 2024 3:59 PM | Updated on Nov 1 2024 4:21 PM

Ind vs NZ 3rd Test: Jadeja, Sundar Shines New Zealand Bowl Out 235 on Day 1

న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్‌ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్‌ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్‌ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 

పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ కోల్పోయి
తద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్‌ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్‌ సేనకు అత్యంత ముఖ్యం. 

లంచ్‌కు ముందు ఇలా
ఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. కివీస్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(4)ను అవుట్‌ చేసి పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ శుభారంభం అందించగా.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(28), రచిన్‌ రవీంద్ర(5) రూపంలో బిగ్‌ వికెట్లు దక్కించుకున్నాడు.

జడేజా విశ్వరూపం
లంచ్‌ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్‌ యంగ్‌(71) రూపంలో తొలి వికెట్‌ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్‌ బ్లండెల్‌(0)ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌(17)ల పనిపట్టాడు.

 

అదే విధంగా ఇష్‌ సోధి(7), మ్యాట్‌ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్‌ మిచెల్‌(82), అజాజ్‌ పటేల్‌(7)లను కూడా అవుట్‌ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. 

కివీస్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌(71), డారిల్‌ మిచెల్‌(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్‌ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్‌  235 పరుగులు(తొలి ఇన్నింగ్స్‌) చేసి తొలిరోజే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్‌ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మూడో టెస్టు(నవంబరు 1- 5)
👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
👉టాస్‌: న్యూజిలాండ్‌.. తొలుత బ్యాటింగ్‌
👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 235 రన్స్‌.. ఆలౌట్‌.

చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్‌ రికార్డు బ్రేక్‌.. అరుదైన జాబితాలో చోటు

Advertisement
 
Advertisement
Advertisement