ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
షెమైన్ క్యాంప్బెల్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేయగా.. ఏడో స్థానంలో బరిలోకి దిగిన స్టెఫానీ టేలర్ 19 బంతుల్లో అజేయమైన 47 పరుగులు (3 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి జట్టుకు పోరాడే స్కోర్ను అందించింది.
మిగతా ప్లేయర్లలో కియానా జోసఫ్ (13), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (14), డియాండ్రా డాట్టిన్ (14), క్లాక్స్టన్ (16), చినెల్ హెన్రీ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో కేథరీన్ ఫ్రేజర్ 2 వికెట్లతో రాణించగా.. కేథరీన్ బ్రైస్, రేచల్ స్లేటర్, గార్డన్ తలో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. డార్సీ కార్టర్, కేథరీన్ ఫ్రేజర్ జోడీ తొలి వికెట్కు 51 పరుగులు జోడించి వెస్టిండీస్ను ఒత్తిడిలోకి నెట్టింది. గాయంతో ఇబ్బంది పడుతూనే కార్టర్ 53 బంతుల్లో అర్ధశతకం సాధించింది.
ఈ దశలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మ్యాచ్ను మలుపుతిప్పింది. వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి స్కాట్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆమె మూడు, అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 23 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో గట్టిగా పోరాడినా 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది.
ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-బీలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సెమీస్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది.


