
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు వారాల ముందే ఇంగ్లండ్ గడ్డపై అడగుపెట్టిన భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను బ్యాకప్ ఆప్షన్గా భారత టెస్ట్ జట్టులో చేర్చినట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కలేదు.
కానీ ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఎ జట్టుకు రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో ఉన్న రాణాను జట్టుతో పాటు ఉండమని సెలక్టర్లు సూచించినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అయితే అతడిని ఇంకా జట్టులో అధికారిక సభ్యుడిగా లెక్కించలేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు క్రిక్బజ్ తెలిపింది.
కాగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్లో రాణా తన టెస్టు అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు ఆటగాళ్ల గాయాల బెడద దృష్ట్యా అతడికి మరోసారి అవకాశం లభించింది.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?