IND vs SL: డబుల్‌ సెంచరీ చేశాక ఈ చర్చలు ఎందుకు? భారత ఓపెనర్‌గా అతడే సరైనోడు..!

Gambhir Wants ishan Kishan To Open With Rohit Sharma In ODIs - Sakshi

వన్డే ఫార్మాట్‌లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఉండాలని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ జోడిగా కిషన్‌ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని గంభీర్‌ సూచించాడు.

ఇక కిషన్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల బం‍గ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్‌ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తొలి అంతర్జాతీయ సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలిచిన ఏకైక ఆటగాడిగా ఈ జార్ఖండ్‌ డైన్‌మెట్‌ చరిత్ర సృష్టించాడు.

కాగా కిషన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో భారత వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కెరీర్‌ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అతడి అంతర్జాతీయ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే అని చేప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోతో గంభీర్‌ మాట్లాడుతూ.. "ఇషాన్‌ ఇటీవలే బంగ్లాదేశ్‌పై అద్భుతమైన డబుల్‌ సెంచరీ సాధించాడు. అయినప్పటికీ వన్డేల్లో భారత రెగ్యూలర్‌ ఓపెనర్‌ ఎవరన్న విషయం గురించి చర్చలు జరగుతుండడం నాకు ఆశ్చర్యంగా ఉంది.

బంగ్లాతో వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి  ఇబ్బందులు పడ్డా.. కిషన్‌ మాత్రం ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు. అతడు భారత ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌ ముగిసే సరికి డబుల్‌ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అతడికి దీర్ఘ కాలం రాణించే సత్తా ఉంది. అదే విధంగా వికెట్‌ కీపర్‌గా కూడా కిషన్‌ సేవలు అందించగలడు.

నా వరకైతే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ ముగిసింది అని అనుకుంటున్నాను. వన్డేల్లో రోహిత్‌ జోడిగా ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగాలి. అదే విధంగా విరాట్‌ కోహ్లి మూడు, సూర్య కుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ రావాలి. ఇక కీలకమైన ఐదో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఉండాలి. ఫినిషర్‌గా హార్దిక్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి" అని అతడు పేర్కొన్నాడు.

కాగా గంభీర్‌ పేర్కొన్న ఆరుగురి ఆటగాళ్లలో స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ పేరు లేకపోవడం గమనార్హం. ​కాగా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌కు భారత  జట్టులో కిషన్‌ చోటు దక్కించుకున్నాడు. ఇక స్వదేశంలో భారత జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడేందకు సిద్దమవుతోంది. ముంబై వేదికగా భారత్‌-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో హార్దిక్‌ పాండ్యా భారత సారథిగా వ్యవహరించనున్నాడు.
చదవండిUmran Malik: నా ధ్యాస మొత్తం దాని మీదే! అక్తర్‌ రికార్డు బద్దలు కొడతా! అయితే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top