టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్-భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాక్ సర్కార్ నిర్ణయంతో ఈ హైవోల్టోజ్ మ్యాచ్ జరిగే సూచనలు కన్పించడం లేదు. అయితే పాకిస్తాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆంసతృప్తి వ్యక్తం చేసింది.
పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. దీనిపై పీసీబీ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్ ఎహసాన్ మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్తాన్పై చర్యలు తీసుకునే హక్కు ఐసీసీకి లేదని అతడు అన్నాడు.
"ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా తమ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ సూచనలను పాటిస్తే సదరు క్రికెట్ బోర్డుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము. ఇప్పుడు పీసీబీ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది.
గతంలో భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్కు వచ్చేందుకు నిరాకరించింది. భారత ప్రభుత్వం అనుమతించలేదనే కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. అప్పుడు బీసీసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. ఇప్పుడు పాకిస్తాప్పై ఆంక్షలు విధిస్తే అది కచ్చితంగా ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లే అవుతోంది.
మొహ్సిన్ నఖ్వీ కేవలం పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడే కాదు, పాక్ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా. ఆయన మొదటి నుంచే ఐసీసీ నిర్ణయాలపై ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందుగానే పసిగట్టడంలో విఫలమైంది. ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని" స్పోర్ట్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి పేర్కొన్నారు.
ఎహసాన్ మణి గతంలో ఐసీసీ చైర్మెన్గా కూడా పనిచేశారు. కాగా 'పరస్పర అంగీకారం'తో సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ను ఐసీసీ కోరింది. ఒకవేళ వేళ పాక్ తమ మొండిపట్టు వీడకపోతే, ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఐసీసీ ఆదాయంలో మెజారిటీ వాటా భారత్-పాక్ మ్యాచ్ల నుంచే వస్తుంది. ఇదే విషయంపై ఐసీసీ మరో రెండు రోజుల్లో బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్


