యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టాతక సిరీస్లో ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.
బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో అట్కిన్సన్ తొడ వెనక కండరాలు పట్టేశాయి. అనంతరం స్కాన్ రిపోర్ట్లో గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్రత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్లో అతడు మూడు మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.
పాట్స్ ఎంట్రీ?
ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవన్లో రానున్నట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బట్టి స్పిన్నర్ ఆడించాలనుకుంటే షోయబ్ బషీర్ను తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖరి మ్యాచ్లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని స్టోక్స్ సేన భావిస్తోంది.
సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.


