
క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ మ్యాచ్ జరిగింది. ఓ అంతర్జాతీయ టీ20లో ఏకంగా మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. నెదర్లాండ్స్-నేపాల్ మధ్య స్కాట్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్ ఈ అద్భుతానికి వేదికైంది. భారతకాలమానం ప్రకారం నిన్న (జూన్ 16) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి.
అనంతరం తొలి సూపర్ ఓవర్లో, రెండో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమయ్యాయి. చివరికి మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. నేపాల్పై నెదర్లాండ్స్ చారిత్రక విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలడం ఇదే మొదటిసారి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు ఆతిథ్య స్కాట్లాండ్తో కలిసి టీ20 ముక్కోణపు సిరీస్లో పాల్గొంటున్నాయి. ఈ సిరీస్లో భాగంగా గ్లాస్గో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో నేపాల్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
ఆ జట్టు ఇన్నింగ్స్లో తేజ నిడమానూరు (35) టాప్ స్కోరర్గా నిలువగా.. విక్రమ్జిత్ సింగ్ (30), సాకిబ్ జుల్ఫికర్ (25 నాటౌట్), మైఖేల్ లెవిట్ (20), మ్యాక్స్ ఓడౌడ్ (19), లయన్ క్యాచెట్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచ్చేన్ 3, నందన్ యాదవ్ 2, రాజ్బంశీ, కుశాల్ భుర్టెల్ తలో వికెట్ తీశారు.
A T20 MATCH GOING TILL THE 3RD SUPER OVER BETWEEN NEPAL AND NETHERLANDS. 🤯pic.twitter.com/RUFOk5qPFb
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 16, 2025
అనంతరం బరిలోకి దిగిన నేపాల్ కూడా నిర్ణీత ఓవర్లలో 152 పరుగులే (8 వికెట్ల నష్టానికి) చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. నేపాల్ ఇన్నింగ్స్లో రోహిత్ పౌడెల్ (48), కుశాల్ భుర్టెల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో నందన్ యాదవ్ (4 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) నేపాల్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో డోరమ్ 3, విక్రమ్జిత్ 2, కైల్ క్లెయిన్, బెన్ ఫ్లెచర్, లయన్ క్యాచెట్ తలో వికెట్ తీశారు.
తొలి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ వికెట్ నష్టపోయి 19 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ వికెట్ నష్టపోకుండా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్కు దారి తీసింది.
రెండో సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు తలో 17 పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్కు వెళ్లింది. ఈ సూపర్ ఓవర్లో నేపాల్ 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ టార్గెట్ ఒక్క పరుగుగా మారింది. ఛేదనలో మైఖేల్ లెవిట్ తొలి బంతికే సిక్సర్ బాది నెదర్లాండ్స్కు చారిత్రక విజయాన్ని అందించాడు.